Friday 25 January 2013

యానాంధ్రప్రదేశ్‌ :-)



తెలుగు మాట్లాడే వాళ్లమంతా ఒకటిగానే ఉందాం! జున్నుగడ్డ లాంటి తెలుగుగడ్డను ఎవరూ చీల్చలేరు! ఇలా మాట్లాడుతుంటే నాకో సందేహం వచ్చింది! మీ పక్కనే కాకినాడ మీదుగా వెళ్తే వచ్చే యానాంని ఎందుకు వదిలిపెట్టారు. అది కూడా తెలుగు మాట్లాడే రాష్ట్రమే కదా! అక్కడా మీ గోదావరి పరిమళమే వ్యాపిస్తుంది కదా! కాసేపు తెలంగాణ ప్రజలు మాట్లాడేది తెలుగు కాదనుకోండి! అసలు మేం తెలుగువాళ్లమే కాదనుకోండి!  
యానాం1954లో ఫ్రెంచి నుంచి విమోచనం చెంది స్వతంత్ర భారతావనిలో కలిసింది.1956లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రం ఏర్పడ్డా అది మాత్రం ఆంధ్రలో  కలవలేదు. ఎందుకని అడిగితే ఈ పిచ్చి సమైక్యవాదుల దగ్గర సమాధానం లేదు. అందుకే లేవండి. తెలంగాణను వదిలేసి యానాం కోసం ఉద్యమం చేయండి! మరో పొట్టి శ్రీరాములుని తయారు చేయండి! లగడపాటిలా చేతిలో జెండా పెట్టి దీక్షకు కూచోపెట్టండి! చివరికి అతణ్నీ చంపేయండి! పొట్టి శ్రీరాములిని చంపేసినట్టు!
అవునూ.. వీళ్లంతా మాట్లాడితే పొట్టి శ్రీరాములు త్యాగం గురించి బట్టలు చింపుకుంటారు! ఇంతకూ ఆంధ్రాలో సీమలో కలిపి ఆ మహానుభావుడి విగ్రహాలు ఎన్నున్నాయో? ఈమధ్యనే నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టారు కానీ!
ఇప్పుడు వీళ్లంతా దేశ సమతుల్యం సమైక్యత గురించి మాట్లాడుతున్నారు కానీ.. 1953 లో ఉమ్మడి మదరాసు నుంచి విడిపోదామని వేర్పాటు వాద ఉద్యమం చేయడం ఏ దేశ సమైక్యతకు నిదర్శనం? అప్పుడు లేని దేశ సౌర్వభౌమాధికారం ఇప్పుడే వచ్చిందా?  
సరే.. మళ్లీ పాయింటుకొద్దాం! మాతో చేసుకున్నట్టే యానాం వాళ్లతో పెద్ద మనుషుల ఒప్పందం చేసుకోండి! నిధులన్నీ మలుపుకోండి! ఉద్యోగాలు కొల్లగొట్టండి! స్టార్టింగ్‌లో ఎంకరేజ్ చేయండి! ఐదేళ్ల తర్వాత మీ స్టయిల్లో తొక్కండి!
రాష్ట్రం విడిపోతే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ చిన్నదవుతుందనే కదా మీ ఏడుపు! అందుకే మీకు తోక యానాం ఉంది. కలుపుకోండి! పైగా మీ కాకినాడ దగ్గరలోనే ఉంది. దాదాపు 30వేలకు పైగా జనాభా ఉందట. అక్కడ ఫ్రెంచి వాసనలు ఏమైనా మిగిలి ఉంటే కడిగేయండి. చరిత్రను చెరిపేయడం మీకు అలవాటే కదా! పైగా అదొక పర్యాటక ప్రాంతం! ఆదాయమూ కలిసొస్తుంది. పేపర్‌ కూడా తూర్పుగోదావరి జిల్లాదేనట. ఎక్కడో 850 కిలోమీటర్లకు పైగా దూరంలో పుదుచ్ఛేరి ఉంది. అంతదూరం పోయే ఖర్మ మీ తెలుగు ప్రజలకేం పట్టింది! అక్కడ అనేక ప్రత్యేక రాయితీలు అందుతున్నాయట. పన్ను రాయితీలు పుష్కలంగా ఉండెనట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దొంగ సర్టిఫికెట్లతో ఆంధ్రావాసులు ఇప్పటికే యానాంలో సెటిలైనట్టు తెలుస్తోంది. దొంగల్లా బతికే ఖర్మ మీకెందుకు? కలిపేసుకుంటే దర్జాగా దొరలా బతకొచ్చు. ఇప్పటికే కేంద్ర నిధులు భారీగా ఉండొచ్చు. వెళ్లి కుమ్మేయండి! దోచుకున్నోడికి దోచుకున్నంత! యానాంలో పరిశ్రమలు కూడా బాగానే ఉన్నాయిట! పెట్టుబడులు పెట్టండి! ఉద్యోగాలు కబ్జా చేయండి! భూములు కబ్జా చేయండి! అయినా ఇదేం మీకు కొత్త కాదుగా! అక్కడ భారీగా రాయితీలు పొందిన తర్వాత పరిశ్రమలను మధ్యలో వదిలేసి వచ్చిన బాపతే కదా మీరు. లేటయితే పుదుచ్చేరికి రాష్ర్ట ప్రతిపత్తి వస్తుంది. ప్రతిపాదన కూడా ఉంది. అది రాకముందే మేల్కోండి! 
కాకినాడ-పుదుచ్చేరిల మధ్య జల మార్గానికి జాతీయ హోదా కూడా వస్తోంది. ఫ్యూచర్‌లో కొన్ని చోట్ల బకింగ్ హామ్ కాలువకు, బంగాళా ఖాతానికి మధ్య బ్రిడ్జిలు వచ్చే అవకాశముంది. ఏమో ఎవరు చెప్పొచ్చారు.. కాంట్రాక్టులు మీకే దక్కొచ్చేమో! ఈ జాతీయ జలమార్గం ఏర్పాటయితే కాకినాడ కాలువ- ఏలూరు కాలువ- కొమ్మమూరు కాలువ- బకింగ్ హామ్ కాలువ మీ పరిధిలోకి వస్తాయి. ఇండోర్ స్టేడియానికి కళ్యాణమండపానికి ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు దివంగత రాజశేఖరరెడ్డి పేరు పెట్టారట. ఆ పెద్దాయన కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారట!
ఈలోగా యువంగత నేత జగన్‌ జైలు నుంచి వచ్చాక అక్కడ కూడా ఓదార్పు యాత్ర చేసి ఇంకొన్ని పెడతాడు లే! అప్పుడు మీ తెలుగుజాతి సమైక్యత, భాషా ప్రయుక్త రాష్ట్ర ఉద్దేశం కల నెరవేరుతుంది. తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు. అప్పుడు యానాంధ్రప్రదేశ్‌గా వర్ధిల్లండి!!  

No comments:

Post a Comment